కొందరికి చర్మం మీద నల్లటి మచ్చలు, మొటిమలు వస్తుంటాయి. రకరకాల చర్మ సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీటిని పోగొట్టడంలో బంగాళాదుంపలు, నిమ్మకాయలు, బొప్పాయి ఎంత శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి కణాల పునరుత్పత్తికి, పాడైన చర్మం ఊడిపోవడానికి సహకరిస్తాయి. అంతేకాదు రకరకాల చర్మ సంబంధమైన సమస్యల్ని కూడా ఇవి పరిష్కరిస్తాయి. బంగాళాదుంపల్లో బి-కాంప్లెక్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫర్సల వంటివి ఎన్నో ఉన్నాయి. చర్మాన్ని కాంతివంతంగా మలిచే గుణం బంగాళాదుంపల్లో ఉంది. వీటిల్లోని బి కాంప్లెక్స్ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా విటమిన్ బి కాంప్లెక్స్లోని నియాసినామైడ్ వల్ల కణాల వృద్ధి బాగా జరుగుతుంది. అంతేకాదు ఇది చర్మాన్ని ఎంతో కాంతివంతంగా మలుస్తుంది. నల్లగా అయిన చర్మ భాగంలో బంగాళాదుంప ముక్కతో పదినిమిషాల పాటు గుండ్రంగా రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ బంగాళాదుంప ముక్క ఎండిపోయినట్టు ఉందనిపిస్తే మరో ముక్కను తీసుకుని చర్మంపై అప్లై చేయాలి. నిమ్మకాయలో కావాల్సినంత సి-విటమిన్ ఉంటుంది. ఇది సహజసిద్ధమైన యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది. చర్మంలో ఉండే మిలానిన్ని తగ్గిస్తుంది కూడా. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని పొడి పొడిగా వచ్చేట్టు చేస్తుంది. అంతేకాదు సిట్రిక్ యాసిడ్ చర్మంలోని మృతకణాలను పోగొట్టి చర్మం కాంతివంతంగా ఉండేట్టు చేస్తుంది. ఒక టేబుల్స్పూన్ బ్రౌన్ షుగర్లో తెల్లసొన కలిపి అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని చేతులతో సుతిమెత్తగా రుద్దాలి (వృత్తాకారంలో). ఇలా పది నుంచి పదిహేను నిమిషాలపాటు చేసి తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేసుకోవాలి. బొప్పాయిలో ప్రొటీన్లతో కూడిన ఎంజైమ్ ఉంటుంది. అది కూడా పాడైన చర్మం పొడిగా రాలిపోవడానికి సహకరిస్తుంది. బొప్పాయి ట్రీట్మెంట్ తీసుకుంటే కొత్త కణాలు చర్మంలో వృద్ధిచెందుతాయి. బాగా పండిన బొప్పాయి నుంచి రసం తీసి దాన్ని నల్లమచ్చలున్న ప్రాంతంలో మాస్కులా రాసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అది ఎండిన తర్వాత చల్లటి నీళ్లతో ఆ ప్రదేశాన్ని కడిగేయాలి. ఇలా ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలను చూడగలరు. ఆధారము: ఆంధ్రజ్యోతి