బరువు తగ్గించుకోవాలన్నా, తగ్గిన బరువు మళ్లీ పెరగకుండా ఉండాలన్నా అందుకు సాయపడేవి రెండే రెండు అంశాలు. ఒకటి వ్యాయామం, రెండోది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు. అయితే మీరనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు శరీరాన్ని సిద్ధంచేసేవి కూడా కొన్ని ఉంటాయి. ముందు చెప్పుకున్న ఆ రెండు అంశాలతో పాటు వీటిని కూడా అనుసరిస్తే కోరుకున్న ఫలితం కళ్లముందే. దాల్చిన చెక్క టీ కావలసినవి: దాల్చిన చెక్క పొడి - ఒక టీస్పూన్, దాల్చిన చెక్క - ఒకటి, మంచినీళ్లు - ఒక కప్పు. తయారీ: గిన్నెలో నీళ్లుపోసి మరిగించాలి. మరో గిన్నెలో దాల్చిన చెక్కపొడి, చెక్కలను వేసి మరగపెట్టిన నీళ్లుపోసి పావుగంట నానబెట్టాలి. దీన్ని రోజుకి ఒకటి లేదా రెండు సార్లు తాగొచ్చు. గ్రీన్ లేదా అల్లం టీ కావలసినవి: తాజా అల్లం ముక్క (పొట్టుతీసి సన్నగా తరిగి) - చిన్నముక్క లేదా అల్లం గుజ్జు - అర టీస్పూన్, గ్రీన్ టీ - ఒక టీస్పూన్, నీళ్లు - ఒక కప్పు, ఆర్గానిక్ తేనె (అవసరమయితే). తయారీ: గ్రీన్ టీ లేదా అల్లంను ఒక గిన్నెలో వేసి మరిగించిన నీళ్లు పోయాలి. ఎక్కువసేపు గ్రీన్ టీ నానితే చేదెక్కుతుంది. అందుకని మూడు నుంచి నాలుగు నిమిషాల కంటే ఎక్కువసేపు నానపెట్టొద్దు. తియ్యగా తాగాలనుకుంటే కొంచెం తేనె కలుపుకోవచ్చు. పాలు లేదా పంచదార అస్సలంటే అస్సలు వేసుకోవద్దు. ప్రతిరోజు పరగడుపున ఒకటి లేదా రెండు కప్పులు తాగాలి. గులాబీపూరేకల నీళ్లు కావలసినవి: తాజా లేదా ఎండబెట్టిన గులాబీ రేకలు - ఒక గుప్పెడు, డిస్టిల్డ్ వాటర్ - రెండు కప్పులు, గిన్నె. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే రసాయనాలు వాడని గులాబీ పూరేకులు కావాలి. తయారీ: స్టవ్ పైన గిన్నె పెట్టి గులాబీరేకలు వేసి అవి మునిగేన్ని డిస్టిల్డ్ వాటర్ పోయాలి. కొన్ని రేకలు పైకి తేలినా పర్వాలేదు. ఆవిరి బయటికి పోకుండా బిగుతైన మూతను గిన్నె మీద పెట్టి స్టవ్ను సిమ్లో ఉంచాలి. పూరేకలు రంగు మారేవరకు అంటే పావుగంట ఇరవై నిమిషాల తరువాత స్టవ్ ఆపేయాలి. చల్లారాక గాజు సీసాలోకి వడకట్టాలి. రిఫ్రిజిరేటర్లో పెట్టి ఆరు రోజుల వరకు ఉంచొచ్చు. అర లేదా ఒక కప్పు గులాబీ నీళ్లను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగాలి. నల్లమిరియాలు, నిమ్మరసం కావలసినవి: నల్లమిరియాలు (దంచి) - కొన్ని, నిమ్మరసం - అరచెక్క, నీళ్లు తయారీ: నీళ్లలో నిమ్మరసం కలిపి నల్లమిరియాల పొడిని వేయాలి. పెపర్ మిల్లో మిరియాలు దంచుతుంటే మూడు నుంచి నాలుగు సార్లు మిల్ను తిప్పాలి. భోజనం చేశాక రోజుకి ఒకసారి ఈ నీటిని తాగాలి. ఇవి తాగడం వల్ల రక్తంలో కొవ్వు నిల్వలు తగ్గుతాయి. తిన్న ఆహారంలోని పోషకాలు శరీరం సరిగా శోషించుకునేలా చేస్తుంది. నిమ్మరసం జీర్ణవ్యవస్థను సరిచేస్తుంది. ఆధారము: ఆంధ్రజ్యోతి